పాక్‌లో మైనర్‌ హిందూ అమ్మాయి కిడ్నాప్‌.. బలవంతంగా మత మార్పడి చేసి..

Spread the love

పాకిస్థాన్‌లో మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పాకిస్థాన్‌లో మైనార్టీలందరిపై దాడిచేస్తూ.. వారిని బలవంతంగా మతం మార్చుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందూ, క్రిస్టియన్‌లకు చెందిన యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిలపై ఈ దాడులు జరుగుతున్నాయి. మైనర్‌ అమ్మాయిలను, యుక్త వయస్సులో ఉన్న యువతులను కిడ్నాప్‌ చెయ్యడం.. ఆ తర్వాత వారిని బలవంతంగా మతం మార్చడం కామన్‌గా మారింది.ఆ తర్వాత వారిని ముస్లిం యువకులకు లేదా.. ముస్లిం పురుషులతో వివాహం చేయడం జరుగుతోంది. ఈ ఘటనలపై అమ్మాయిల తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే వారే ఉండరని పాక్‌కు చెందిన పలువురు హిందూ నేతలు వాపోతున్నారు. ఇప్పటికే వేల మంది మైనర్‌ హిందూ అమ్మాయిలను, సిక్కు అమ్మాయిలను, క్రిస్టియన్‌ అమ్మాయిలను కిడ్నాప్‌ చేయడం.. బలవంతంగా మతం మార్చి.. పెళ్లిళ్లు చేసుకోవడం జరుగుతోంది.

తాజాగా.. పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్స్‌లో కూడా మరో దారుణం చోటుచేసుకుంది. ఓ వైపు కరోనా వైరస్‌తో ప్రపంచం పోరాడుతుంటే.. పాక్‌లోని ముస్లింలు.. ఓ పద్నాలుగు సంవత్సరాలున్న మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి.. ఆ తర్వాత మతం మార్చి వివాహం చేసుకున్నారు. సింధ్‌ ప్రావిన్స్‌లోని చుండికో ప్రాంతానికి చెందిన అమ్మాయిని.. నలభై ఏళ్ల మహ్మద్‌ ఆచార్‌ దరేజో అనే పురుషుడు వివాహం చేసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి కిడ్నాప్‌ చేసుకుని దూరంగా వెళ్లి మతం మార్చి.. నిఖా జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలతో పాటు… అమ్మాయి చేతిలో మతం మారిన పేపర్లు, నిఖా పత్రాలతో ఫోటో కూడా తీశారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను పాకిస్థాన్‌లోని మైనార్టీ సంఘాలు ఖండిస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మైనార్టీలపై దాడులను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. 2019లో దాదాపు 41 మంది హిందూ బాలికలను కిడ్నాప్‌ చేసి.. వారిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినట్లు తెలుస్తోంది. వారందర్నీ ముస్లి యువకులతో, పురుషులతో పెళ్లిళ్లు చేసినట్లు సమాచారం. పాకిస్థాన్‌లో మొత్తం 4.5 మిలియన్ల మంది హిందువుల జనాభా ఉండగా.. వారిలోని మైనర్ హిందూ అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి బలవంతంగా మతం మార్చుతూ.. మైనార్టీలపై దాడులు చేస్తున్నారు. కాగా.. హిందువులు ఎక్కువగా ఈ సింధ్ ప్రాంతంలోనే ఉన్నారు.

ప్రతి ఏటా వేలాది మంది హిందూ, క్రిస్టియన్‌, సిక్కు మతాలకు చెందిన మైనార్టీ యువతులను కిడ్నాప్‌ చేయడం.. వారి కుటుంబాల నుంచి దూరంగా తీసుకెళ్లి.. బలవంతంగా మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవడం పరపాటిగా సాగుతోంది. సదరు అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని.. కిడ్నాప్‌ అయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఆ కేసులు పోలీస్ స్టేషన్‌లో ఫైల్‌ కింద ఉండటమే తప్ప.. మైనార్టీలకు న్యాయం జరగడమన్నది శూన్యం. 2018లో పాకిస్థాన్‌ మానవ హక్కుల కమిషన్‌ వార్షిక లెక్కల ప్రకారం.. ఒక్క దక్షిణ సింధ్ ప్రావిన్స్‌ ప్రాంతంలోనే దాదాపు వెయ్యి మందికి పైగా హిందూ యువతులను కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా మతం మార్చి పెళ్లిళ్లు చేసుకున్నట్లు అంచనా.


Spread the love
error: Content is protected !!