ఇడ్లీలు.. ప్రస్తుతం ఎక్కడైనా సరే.. రూ.20 పెడితే.. రెండు లేదా మూడు వస్తాయి. ఇక రోడ్డుపై ఉండే బండిపైన అయితే కొన్ని చోట్ల నాలుగు ఇడ్లీలు వస్తాయి. మరి రూ.10/-కే నాలుగు ఇడ్లీలు ఎక్కడైనా వస్తాయా.. ? అంటే అది అసాధ్యమనే చెబుతారు. అయితే తమిళనాడులో మాత్రం రూ.10/-కే నాలుగు ఇడ్లీలు ఇస్తామంటూ ప్రచారం జరుగుతోంది. అవి కూడా అలాంటి ఇలాంటి ఇడ్లీలు కాదు మరీ.. మోదీ ఇడ్లీలు. మోదీ ఇడ్లీలు అంటే వేరే అనుకునేరు. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీలే. కానీ వీటిని అమ్మేది తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఒకరు. ఆ రాష్ట్ర బీజేపీ ప్రచార విభాగానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాడు. ఓ వైపు బిజినెస్తో పాటు.. మరోవైపు పార్టీ ప్రచారం కూడా కానుంది. తమిళనాడులో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీకి ఇలాంటి ప్రచారం ద్వారా ప్రజలను దగ్గర అయ్యే అవకాశం ఉండేట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ ఇడ్లీలు.. రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మహేష్ తెలిపారు. అంతేకాదు.. దీనికి సంబంధించి పోస్టర్లను కూడా రెడీ చేశారు. ఇక కస్టమర్లు ఇడ్లీ కొనేందుకు కూపన్స్ కూడా డిజైన్ చేశారు. ఫ్రంట్ సైడ్ మోదీ ఫోటోతో పాటుగా.. మషేష్ ఫోటో కూడా ముద్రించి ఉంది. ఇక వెనుక వైపు యాడ్స్ కూడా తీసుకుంటామని.. అందుకు ఒక్కో కూపన్కు రూ.1/-చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. అందుకు ఒక యాడ్ కనీసం 50 వేల కూపన్లకు అయితేనే స్వీకరిస్తామని మషేష్ తన ట్విట్టర్లో తెలిపారు. మొత్తానికి మోదీ బ్రాండ్ని ఉపయోగిస్తూ చేస్తున్న ఈ ఇడ్లీ వ్యాపారం ఎలా ఉంటుందో వేచి చూడాలి.