దేశంలో రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అంతేకాదు ప్రత్యేక చట్టాలను కూడా తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా గోవుల విషయంలో యూపీ, మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో గోహత్య చేస్తే కఠిన శిక్షలు విధించడం వంటి చట్టాలు తేవడమే కాకుండా.. గోవులు రైతులకు ఆదాయ వనరుగా చేసేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై ఆ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే ఫినాయిల్.. గోమూత్రంతో తయారు చేసిందై ఉండాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మధ్యప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని జనరల్ అడ్మినిష్ట్రేషన్ విభాగం ఓ ఉత్తర్వును కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వుకు సంబంధించి ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ క్లారిటీ ఇచ్చారు. గోమూత్రంతో తయారు చేసే ఫినాయిల్ కర్మాగారాలను ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని.. దీంతో గో సంపద కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులకు కూడా గో ఆధారిత వ్యవసాయంతో పాటు.. ఇలా గోమూత్రం సేకరణతో అదనపు లాభాలను పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.