అయోధ్యలో నిర్మాణమవుతున్న శ్రీ రామ్ మందిరానికి దేశ వ్యాప్తంగా నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మకర సంక్రాంతి రోజు ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల చివరి వరకు ఈ నిధి సమర్పణ అభియాన్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. తెలంగాణలో జనవరి 20వ తేదీన ప్రారంభమైన నిధి సమర్పణ అభియాన్.. ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజల నుంచి మందిర నిర్మాణానికి నిధి సమర్పణ జరుగుతోంది. ఇతర వర్గాల ప్రజలు కూడా స్వచ్ఛంధంగా నిధి సమర్పిస్తున్నారు.
తాజాగా మల్కాజ్గిరి జిల్లాలో విదేశీయులు కూడా రామ మందిర నిర్మాణం కోసం నిధి సమర్పించారు. మల్కాజ్గిరి నగరంలోని సీతారం నగర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. సీతారం నగర్లో నివసిస్తున్న ఫిలిఫ్పైన్స్ దేశస్థుల దగ్గరికి నగర సంచలన సమితి సభ్యులు వెళ్లి.. అయోధ్యలో జరుగుతున్న రామ మందిర నిర్మాణ విషయాన్ని తెలియజేశారు. మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యంగా ఉండాలని.. అందుకే ఈ నిధి సమర్పణ అభియాన్ జరుగుతుందని వారికి తెలియజేశారు. అనంతరం వారు రామ మందిర నిర్మాణానికి తమవంతు సాయంగా 1200/-రూపాయల నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నగర సంయోజక్ రామేశ్వర్ సుత్రవేతో పాటు.. సభ్యులు బక్క నాగరాజ్, భారతుల శ్రీనివాస్, హిమవంత్, కలష్, మహిళా ప్రముఖ్ శ్యామల పాల్గొన్నారు.