సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయంటే.. నిజం నిలబడి చెప్పులు తొడుక్కునే లోపు.. అబద్దం అంగట్లో ప్రచారం చేసినట్లు. నిజం.. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం ఇది. అయితే ఈ ఫేక్ వార్తలు యావత్ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న చిత్రాలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు కూడా ఈ వైరల్ ఫోటోలను ప్రదర్శించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గత కొద్ది రోజులుగా దేశంలో ఆక్సిజన్ కొరతతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజురోజుకు లక్షల కేసులు నమోదవుతుండటంతో అనేక ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడమే కాదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజల్ని పట్టించుకోవడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఓ పెద్దావిడ రోడ్డుపై ఆక్సిజన్ పెట్టుకున్నట్లు ఉన్న ఫోటో ఒకటి.. బైక్పై వెళ్తూ సిలిండర్ తగిలించుకున్నట్లు ఉన్న మరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రెండు ఫోటోలు మన దేశంలో ప్రస్తుతం ఉన్న తీరును తెల్పుతున్నాయంటూ కొందరు నెటిజన్లు పోస్టులు చేయడంతో.. ఇవి కాస్త వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఈ చిత్రాలను ప్రదర్శిస్తూ.. భారత స్వాభిమానానికి నిదర్శనమైన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని లింకు చేస్తూ వైరల్ చేస్తున్నారు. దేశంలో ఇలాంటి విగ్రహాలు అవసరమా.. ఆస్పత్రులు లేక ఇబ్బంది పడుతుంటూ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రాలు రెండు కూడా ఫేక్ ప్రచారానికి ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ రెండు ఫోటోలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేలింది. ఇందులో ఓ పెద్దావిడ రోడ్డుపై కూర్చని ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న చిత్రం దాదాపు మూడు సంవత్సరాల క్రితందని తెలుస్తోంది. 2018లో యూపీలోని ఆగ్రాలో జరిగిన సంఘటన తేలింది. అప్పట్లో ఈ ఘటనపై పూర్తి వివరాలు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రసారం చేసింది. అంబులెన్స్ కోసం వేచిచూస్తున్న సమయంలో తల్లి శ్వాస తీసుకుంటుంటే.. కొడుకు సిలిండర్ను భుజాన పెట్టుకున్నట్లు ఆ ఫోటోలో ఉంది. ఈ ఘటనపై అధికారులు అప్పడే చర్యలు తీసుకున్నారు. అయితే కొందరు కావాలని ఆ చిత్రాలను ఇప్పుడు వైరల్ చేస్తూ ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇక మరో చిత్రం మన దేశానికి చెందినది కాదని.. బంగ్లాదేశ్కు చెందిందంటూ మరో జాతీయ మీడియా పేర్కొంది.
[youtube https://www.youtube.com/watch?v=xrdRKSMkAVM]