దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కాస్త అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు సంస్థలు ఉద్యోగానికి రావాలంటే వ్యాక్సిన్ మస్ట్ అంటూ కండిషన్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిబంధనలు పలు ప్రైవేట్ కంపెనీలు కూడా పెడుతున్నాయి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలా వేసుకోకుండా ఉండటంతో అధికారులు సీరియస్ అవుతున్నారు.
సెకండ్ వేవ్లో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఇక్కడి అధికారులు వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో సీరియస్గా ఉన్నారు. థానే మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వందశాతం సాధించాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోకుండా దూరంగా ఉంటున్న వారిని వ్యాక్సిన్ వేసుకునేలా చేసేందుకు సాలరీకి.. వ్యాక్సిన్కు లింకు పెట్టారు. వ్యాక్సిన్ వేసుకోని సిబ్బందికి సాలరీ ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని.. రెండో డోస్ వేసుకోని వారికి కూడా జీతాలు చెల్లించేది లేదని థానే మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రత్యేక సమావేశంలో తేల్చిచెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఉద్యోగులంతా సంబంధిత కార్యాలయాల్లో వారి వారి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ను సమర్పించాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నెలాఖరులోగా కార్పోరేషన్ పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలన్న టార్గెట్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ నరేష్ మస్కే తెలిపారు.