పాక్ నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దు వెంట యథేచ్చగా కాల్పులకు దిగుతోంది. తాజాగా శనివారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన మాన్కోట్ సెక్టార్ మీదుగా కాల్పులకు తెగబడింది. తెల్ల వారుజామున 2.15 గంటలకు ఈ ఘటనకు పాల్పడింది. వెంటనే అప్రనమత్తమైన సైన్యం.. పాక్ కాల్పులకు తిప్పికొట్టింది.
ఇదిలావుంటే.. తాజాగా మరోసారి శనివారం ఉదయం 11.15 గంటలకు రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్ మీదుగా మోర్టార్ షెల్స్తో కాల్పులకు దిగింది. అంతేకాదు చిన్న చిన్న ఆయుధాలతో కూడా దాడులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్కు ధీటుగా సమాధానం చెప్పింది.
అయితే వరుసగా పాక్ చేస్తున్న కాల్పులతో సరిహద్దు ప్రాంతంలోని గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాక్ కాల్పుల్లో పలువురు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు విడుస్తుండగా.. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. సమీప గ్రామల్లోని ఇళ్లు కూడా ధ్వంసమవుతున్నాయి.