పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యలకు పాల్పడింది. నిత్యం కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులను పంపిస్తూ సైనికులపై దాడులకు పాల్పడేది. అంతేకాదు.. నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సైన్యం వైపు కాల్పులకు తెగబడేది. తాజాగా పాక్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ.. భారత జాలర్లపై కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఓ భారత జాలరి ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన శ్రీధర్గా గుర్తించారు. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ తీరం సమీపంలో అంతర్జాతీయ సరిహద్దు రేఖకు 12 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, అక్టోబర్ 25వ తేదీన దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా వైపు భారత్కు చెందిన ఫిషింగ్ బోట్ జాలర్లతో బయల్దేరింది. నవంబర్ 6వ తేదీన పాక్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ కాల్పులకు పాల్పడి.. పద్మ అనే ఫిషింగ్ బోటును అపహరించుకుపోయినట్లు సమాచారం. అయితే గాయపడ్డ వ్యక్తి అదే బోటు వెంట ఉన్న వెరావల్ అనే మరోబోటులో తిరిగివచ్చారు. అయితే ఆరుగురు భారత జాలర్లను పాక్ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. పది రోజుల క్రితమే భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన 10 మంది పాకిస్తాన్ మత్స్యకారులను భారత ప్రభుత్వం విడుదల చేసింది.