మరో దారుణం.. మొరదాబాద్‌లో పూజారి అనుమానాస్పద మృతి.. హత్యేనంటున్న హిందూ సంఘాలు

Spread the love

దేశంలో నిత్యం ఎక్కడో ఓ చోట హిందూ పూజారులు, సాధువులు లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్క ఈ ఏడాదిలోనే దాదాపు పదుల సంఖ్యలో ఘటనలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా.. శనివారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో రామ్‌ దాస్‌ అనే ఆలయ పూజారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మొరదాబాద్‌లోని గల్‌షహీద్‌ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఉన్న వాల్మీకి ఆయలంలో చోటుచేసుకుంది. దీంతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన గురించి సమాచారం అందుకున్న
పోలీసులు వెంటనే చేరుకున్నారు. మృతిచెందిన పూజారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఫోన్స్‌ స్విచ్చ్‌ ఆఫ్

పూజారి రాందాస్‌ మరణ వార్త విని ఆయన బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆయన మృతిపట్ల అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఆయన ఫోన్‌ స్విచ్చ్‌ ఆఫ్‌ వస్తుందని.. ఆయన ఫోన్ ఏమైందని ప్రశ్నించారు. రాందాస్ మరణ వార్తను ఆలయానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ద్వారా తెలిసిందని.. బంధువు నిర్మల్ గుప్తా తెలిపారు. ఆలయంలో పూజారి మృతదేహం పడి ఉందని వారు తెలిపారని.. వారిద్దరు ఆలయానికి చెందిన వారేనని.. పేర్లు మాత్రం గుర్తులేదని తెలిపారు. అయితే ఆయన ఫోన్ నంబర్‌కి కాల్ చేస్తుంటే స్విచ్చ్‌ ఆఫ్‌ వస్తుందని.. పూజారి రాందాస్‌ను
ఏవరో హతమార్చి ఉంటారని అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం పూజారి వద్ద ఎలాంటి ఫోన్‌ను గుర్తించలేదని చెబుతున్నారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.

నవరాత్రి దీక్ష కోసం వచ్చి..

మరోవైపు ఈ పూజారి ఘటన కేసు దర్యాప్తు గురించి మొరదాబాద్‌ ఎస్‌ఎస్‌పీ ప్రభాకర్‌ చౌదరీ మాట్లాడుతూ.. పూజారి రాందాస్‌ నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వాల్మీకి ఆలయానికి వచ్చారని తెలిపారు. 9 రోజులపాటు ఉపవాస దీక్షలో ఉండేందుకు వచ్చారని.. ఈ క్రమంలో శనివారం నాడు మృతిచెందారని తెలిపారు.

దర్యాప్తు సాఫీగా జరగాలంటూ హిందూ సంఘాల డిమాండ్‌

కాగా, పూజారి రాందాస్‌ గంగా ప్రదూషణ్‌ ముక్తి మోర్చా సంపాదకుడిగా ఉన్నారని తెలుస్తోంది. పూజారిది అసహజ మరణమని.. ఘటనపై దర్యాప్తు క్షుణ్ణంగా జరిపి.. అసలు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో మొరదాబాద్- హరిద్వార్‌ హైవేపై ఆందోళనకు దిగాయి ఆ తర్వాత పోలీసులు చేరుకుని ఆందోళన చేపడుతున్న వారిని చెదరగొట్టారు.

మైనింగ్ మాఫియానే హత్య చేసిందా..?

మరోవైపు పూజారి రాందాస్ వద్ద ఎలాంటి ఫోన్లు లేవని పోలీసులు తెలుపగా.. ఆయన వద్ద మూడు ఫోన్లు ఉండేవని రాష్ట్రీయ యోగీ సేన అధ్యక్షుడు ఆకాష్‌ అగర్వాల్‌ తెలిపారు. పూజారి రాందాస్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారని.. ఇటీవల ఆయన మైనింగ్ మాఫియాపై విమర్శలు చేస్తూ.. ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు ప్రాణహాని ఉందని కూడా తెలిపారని సమాచారం. పూజారి రాందాస్ సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్‌ తొలగించడం, ఆయన ఫోన్లు లేకపోవడం, పర్స్‌తో పాటు ఇతర వస్తువులు కూడా లేకపోవడం
అనుమానాలకు తావిస్తున్నాయని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ హత్యేనంటూ రాష్ట్రీయ యోగీ సేన అధ్యక్షుడు ఆకాష్‌ అగర్వాల్ ఆరోపించారు.

 


Spread the love
error: Content is protected !!