డ్రాగన్ కంట్రీ తన కన్నింగ్ వేశాలు మానడం లేదు. గత జూన్ మాసంలో గాల్వాన్లోయలో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆనాటి ఘర్షణ వాతావరణం కుదుటపడుతున్న వేళ.. చైనా మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది. భారత్ను రెచ్చగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే.. మరోవైపు కుట్రలకు తెరలేపుతోంది.
తాజాగా లదాఖ్లోని పాన్గాంగ్ టీఎస్ఓ లేక్ వద్ద డ్రాగన్ ఆర్మీ కవ్వింపులకు పాల్పడినట్లు భారత ఆర్మీ ప్రకటించింది. శని, ఆది వారాల్లో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి సమయంలో లేక్ వద్ద అలజడి సృష్టించేందుకు చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నించిందని.. అయితే చైనా కుయుక్తులను గమనించిన భారత సైన్యం.. అప్రమత్తమైందని భారత ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. చైనా ఆటలకు బ్రేకులు వేశామని ప్రకటనలో స్పష్టం చేశారు అధికారులు.
డ్రాగన్ కంట్రీ కన్నింగ్ వేశాలను ముందుగానే పసిగట్టామని.. ముందస్తు జాగ్రత్తగా భద్రతను పెంచామని.. దీంతో ఏకపక్షంగా యథాతథస్థితిని మార్చాలనుకున్న డ్రాగన్ ప్లాన్ను విచ్చిన్నం చేశామని భారత్ ఆర్మీ పీఆర్వో కల్నల్ ఆమన్ ఆనంద్ తెలిపారు. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు భారత్ సిద్ధంగా ఉందని.. అందుకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని.. అయితే అదే విధంగా తమ దేశ సమగ్రతను కాపాడుకునేందుకు పొరాడుతుందని.. కల్నల్ ఆమన్ ఆనంద్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వివరించారు.