కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కరోనా కలవరం మొదలైంది. అందుకు కారణం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పంజాబ్లో ఓ బహిరంగ సభలో పాల్గొనడమే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్లో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీతో పాటుగా.. పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ పాల్గొన్నారు.
అయితే ఆరోగ్య శాఖ మంత్రి స్వల్ప అనారోగ్యానికి గురవ్వడంతో..కరోనా పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీనికి సంబంధించిన రిపోర్టులు మంగళవారం వచ్చాయి. అయితే సోమవారం నాడు సంగ్రూర్లో జరిగిన సభలో సదరు ఆరోగ్యమంత్రి.. రాహుల్ గాంధీకి సమీపంలోనే ఉన్నారు. అంతేకాదు.. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, పంజాబ్ సీఎం కూడా అదే వేదికపై ఉన్నారు.మంత్రికి స్వల్ప జ్వరంతో పాటు.. గొంతులో ఇబ్బంది ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని..ఇటీవల మంత్రిని కలిసిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.