గుడ్‌న్యూస్‌‌.. కరోనాకు ఔషధం రెడీ.. 2డీజీ డ్రగ్‌ను రిలీజ్‌ చేసిన కేంద్ర మంత్రులు

Spread the love

కరోనా మహమ్మారికి భారత రక్షణ సంస్థ డీఆర్డీవో డెవలప్ చేసిన 2డీజీ ఔషధం అందుబాటులోకి వచ్చింది. ఈ డ్రగ్‌ను సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేశారు. తొలుత ఈ డ్రగ్‌ను కేంద్ర రక్షణశాఖ మంత్రి విడుదల చేయగా.. అనంతరం దానిని ఆరోగ్యశాఖ మంత్రికి అందజేశారు. ఆ తర్వాత 10వేల డోసులు ఉన్న2డీజీ ఔషధ బాక్స్‌ను ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా చేతికి అందించారు. వీటిని ఢిల్లీలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు.

ఈ 2-డీజీ డ్రగ్‌ భారతదేశానికి మాత్రమే కాకుండా.. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకు కూడా ఉపయోగపడుతుందని.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఈ డ్రగ్‌ ఎంతో ఉపయోగపడుతుందని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DRDO సంస్థతో పాటుగా.. శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో డీఆర్డీవో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు విశేషంగా కృషిచేస్తోందన్నారు.

ఈ 2డీజీ ఔషధం పొడి రూపంలో ఉంటుంది. దీనిని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా శరీరంలో వైరస్‌ ఉన్న కణాల్లోకి చేరి.. దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీవో తెలిపింది. కాగా, కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఇప్పటి వరకు కేవలం వ్యాక్సిన్‌ మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ దేశం కూడా డ్రగ్‌ను అందుబాటులోకి తేలేకపోయింది. గతంలో ఉన్న పలు ఔషధాలను మాత్రమే ఉపయోగిస్తూ ఉండగా.. భారత్‌ మాత్రం తొలిసారి డ్రగ్‌ను కనిపెట్టింది. అయితే దీని ద్వారా కరోనా సోకిన రోగులకు ఆక్సిజన్‌ అవసరం రాకుండా ఉండటమే కాకుండా.. రికవరీ కూడా త్వరగా అవుతారని తెలుస్తోంది. ఇక ఈ 2డీజీ ఔషధాన్ని కరోనాతో బాధపడుతున్న వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

డీఆర్డీవో డెవలప్ చేసిన ఈ 2డీజీ ఔషధ పౌడర్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ సహకారంతో డెవలప్‌ చేసింది. స్వల్ప లక్షణాలతో పాటుగా.. తీవ్ర లక్షణాలు ఉన్న వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేయగా ఇది సమర్ధవంతంగా పనిచేసిందని డీఆర్డీవో పేర్కొంది.

 


Spread the love
error: Content is protected !!