రాహుల్‌ ర్యాలీల రద్దు వెనక అసలు రీజన్‌ ఇదేనా..? లేదా రాజకీయ ఎత్తుగడనా..?

Spread the love

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వెస్ట్ బెంగాల్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం చేపట్టే ర్యాలీలను కాంగ్రెస్‌ పార్టీ విరమించుకుంటుందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోందని.. ఈ పరిస్థితుల్లో ర్యాలీలు చేపడితే వచ్చే పరిణామాలను గ్రహించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఇతర రాజకీయ నేతలందరికీ కూడా ఇదే సలహా ఇచ్చారు. అయితే బీజేపీ పార్టీ చేపడుతున్న ర్యాలీలకు భారీగా ప్రజలు హాజరవుతుండటంపై విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లో మరో మూడు దశల పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో రాహుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్‌ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రశంసిస్తున్నారు. పార్టీ ఎన్నికల ర్యాలీలను రద్దుచేసుకుని రాహుల్‌ గాంధీ ఇతర పార్టీల నేతలకు స్పూర్తిగా నిలిచారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైవీర్‌ షెర్డిల్‌ ప్రశంసలు గుప్పించారు. బీజేపీ పార్టీ తన మొండి వైఖరిని వదులుకుని రాహుల్‌ అడుగు జాడల్లో నడుచుకోవాలంటూ ఆయన కోరారు.

అయితే వెస్ట్ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నట్లు ఎవరూ కూడా పరిగణించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. బెంగాల్‌లో ప్రస్తుతం టీఎంసీ, బీజేపీ మధ్యే గట్టి పోటీ నడుస్తోందని.. అయితే రాజకీయంగా టీఎంసీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు ఇలాంటి జిమ్మిక్కు రాజకీయాలను రాహుల్‌ ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.మొన్న తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సమయంలో కూడా దేశంలో కరోనా ఇలానే విజృంభిస్తోందని.. రాహుల్‌ ఇప్పుడే నిద్ర లేచాడా.. అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్‌ గాంధీ అతి తెలివైన ఎత్తుగడలను గ్రహించారా అంటూ తెలంగాణకు చెందిన ఓ సీనియర్‌ జర్నలిస్టు తన తన ముఖపుస్తకంలో రాసుకొచ్చారు. బెంగాల్ రాష్ట్రంలో కంటే కూడా.. కేరళ, తమిళనాడులలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలోనే రాహుల్‌ గాంధీ అక్కడ ప్రచారం చేపట్టారని.. అనేక చోట్ల కనీసం మాస్క్‌ కూడా లేకుండా కన్పించారని ఆరోపించారు. అయితే ఇక్కడ మరో ఆలోచించాల్సిన విషయం ఉందని.. కాంగ్రెస్ పార్టీ కేరళలో వామపక్షాలతో పోరాడుతుందని.. బెంగాల్‌ రాష్ట్రంలో మాత్రం కలిసి పోటీ చేస్తుందని విమర్శించారు. దీనిని బట్టి చూస్తే.. కేరళలో కుస్తీ.. బెంగాల్‌లో దోస్తీ అన్నట్లు అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో ర్యాలీలు చేపడితే.. ఈ విషయన్ని ప్రజలు గ్రహిస్తారని రాహుల్ గ్రహించారన్నారు. వచ్చే ఓట్లు కూడా రాకుండా ఉంటాయన్న ఆలోచనతో కరోనాను గుర్తుచేసుకుని ఇలా చేశారని అభిప్రాయపడ్డారు. అయితే కేరళ, తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాహుల్‌ ఈ నిర్ణయం తీసుకుంటే.. దేశ ప్రజలంతా హర్షించేవారు. అంతేకాదు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నట్లు ఇతర పార్టీలకు చెందిన నేతలకు రాహుల్‌ స్పూర్తినిచ్చే వారిలా ఉండేవారు. కానీ అంతా అయిపోయే సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం రాహుల్‌కే తెలియాలంటూ విమర్శిస్తున్నారు.


Spread the love
error: Content is protected !!