ఇంతకు క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలా? వద్దా..? గైడ్‌లైన్స్‌ ఏం చెప్తున్నాయి..?

Spread the love

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తుండటంతో.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు దేశ వ్యాప్తంగా అత్యవసర సర్వీసులు మినహా.. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. ప్రజా రవాణా, ప్రైవేట్ రవాణా కూడా స్థంభించిపోయింది. విదేశీ, దేశీ విమాన సర్వీసులు, రైల్వే ఇలా అన్ని నిలిచిపోయాయి. కేవలం కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇక మెజార్టీ ప్రజలందరికీ ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. ఈఎంఐలు ఉండనే ఉంటాయి. గృహ రుణాలు, వాహన రుణాలు, క్రాప్ లోన్లు.. క్రెడిట్ కార్డ్ బిల్లు పేమెంట్స్‌ ఇలా అనేకం ఉంటాయి. అయితే కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిపై మారటోరియం ప్రకటించింది.

అయితే అందరికీ ఈ మారటోరియం అంటే ఏంటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఏదైనా లోన్‌ పొందిన తర్వాత దాన్ని రిటర్న్ చెల్లించేందుకు సదరు బ్యాంకులు కానీ.. ఫైనాన్షియల్ కంపెనీలు కానీ ఇచ్చే గ‌డువును మార‌టోరియం అంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రెపో రేటు తగ్గింపు, లోన్‌ ఈఎంఐలపై 3 నెలల మారటోరియం వంటివి కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ రేట్ల కోత వల్ల లోన్‌లపై వడ్డీ రేట్లు కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు క్రెడిట్ కార్డు కలిగిన వారికి అనేక డౌట్స్‌ వచ్చే అవకాశముంది. ఇంతకు క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా లేదా అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. అంతేకాదు.. మూడు నెలలపాటు “ఈఎంఐ”లు కట్టకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతినదా? అనే ప్రశ్నలు కూడా చాలా మందికి వచ్చే ఉంటాయి.

అయితే అన్నింటి కంటే ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ విషయంలో అనేకమందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. మారిటోరియం అనేది క్రెడిట్ కార్డులకు వర్తిస్తుందా లేదా అన్న దానిపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. వాస్తవానికి ఇవి టర్మ్‌లోన్‌ కిందకు రావు. అయితే వీటన్నింటిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్‌ కూడా ఈఎంఐ మారటోరియం కిందకు వస్తాయని తెలిపింది. దీంతో క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీ మీ బ్యాంకుల నుంచి స్పష్టమైన సందేశాలు వస్తేనే బిల్లులు చెల్లించకండి. ఒకవేళ ఎలాంటి సందేశాలు లేకపోతే.. ఎప్పటిలాగే గడువులోగా బిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పెనాల్టీలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి బిల్ పేమెంట్ కంటే ముందుగానే బ్యాంకు అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోండి.


Spread the love
error: Content is protected !!