వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం టీఎంసీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వేల మంది రాష్ట్రాన్ని విడిచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అసోం, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు వలస పోతున్నారు. అయితే ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిలో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలతో పాటు.. రోహింగ్యాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓ పోలీస్ వాహనంపై కూర్చొని దాడి చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది. సదరు వ్యక్తి రోహింగ్యా ముస్లిం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే ఇదంతా ఇలావుంటే.. మంగళవారం నాడు ఈస్ట్ బర్దమాన్ జిల్లా కేతుగ్రాం తహసీల్లోని శ్రీపూర్ గ్రామంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో స్థానికంగా నివసించే బలరాం మాజీ అనే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. ఇంట్లో ఉన్న బలరాం మాజీని తీవ్రంగా కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ క్రమంలో బలరాం దుండగుల చేతినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంటపడి నేలపై పడేసి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు
తీవ్రంగా గాయాలపాలై.. రక్తపుమడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం బలరాం మాజీని చూసిన స్థానికులు.. అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావమవడంతో బర్దమాన్ పట్టణంలోని నర్సింగ్ హోంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
బలరాం మాజీ మృతిపై బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. టీఎంసీ గుండాల చేతిలో 22 ఏళ్ల బలరాం మాజీ ప్రాణాలు కోల్పోయాడంటూ పేర్కొన్నారు. కాగా, బలరాం ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని.. స్థానికంగా అన్ని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారని స్థానికులు చెబుతున్నారు. బలరాం మృతితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ మూడోసారి విజయం సాధించిన అనంతరం.. టీఎంసీ గుండాల చేతిలో పదుల సంఖ్యలో బీజేపీ, అనుంబంధ సంస్థలకు చెందిన వారు మరణించారని.. అందులో ఇప్పుడు బలరాం మాజీ కూడా చేరాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Balaram Majhi, 22, of Ketugram(East Burdwan)who was mercilessly assaulted yesterday by the TMC perpetrators, succumbed to the injuries today.#PoliticalTerrorism of TMC pic.twitter.com/mAere0udBS
— Dilip Ghosh (@DilipGhoshBJP) May 6, 2021