హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం నవంబర్ 15వ తేదీ ఆదివారం నాడు తెరుచుకుంది. సోమవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా.. స్వామి వారి దర్శనాల విషయంలో ఆలయ బోర్డు పలు ఆంక్షలను విధించింది. సోమవారం నుంచి ప్రారంభమైన మండల పూజ కార్యక్రమం.. డిసెంబర్ 26వ తేదీ 2020 వరకు జరగనుంది. అయితే ఈ సమయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు విడుదల చేసింది.
ఈ గైడ్లైన్స్ ప్రకారం.. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే.. వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే అనుమతి లభిస్తుంది. రోజుకు నియమితంగా 1,000 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇక వారంతంలో మాత్రం ఆ సంఖ్యను రెట్టింపు చేయనున్నారు. వారంతంలో (శని,ఆది )2,000 మంది భక్తులకు అనుమతించనున్నారు. ఇక మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో.. స్వామి దర్శనానికి 5,000 మంది భక్తులకు పర్మిషన్ ఇవ్వనున్నారు. కాగా, ఇప్పటికే డిసెంబర్ వరకు స్వామి వారి దర్శనానికి స్లాట్స్ బుక్ ఫుల్ అయ్యాయి. నవంబర్, జనవరి మాసాల్లో మాత్రం కొన్ని స్లాట్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజ, డిసెంబర్ 30వ తేదీ నుంచి 2021 జనవరి 20వ తేదీ వరకు మకరవిలక్కు పూజ, 2021 జనవరి 14న మకరవిలక్కు పూజలు జరగనున్నాయి.
తప్పక పాటించాల్సిన రూల్స్..
స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ను వెంట తీసుకు రావాల్సి ఉంటుంది. అది కూడా శబరిమల చేరే సమయానికి 24 గంటల్లో పొందినదై ఉండాలి. అయితే భక్తులు వారి వెంట కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లను తీసుకొచ్చినప్పటికీ.. నీలక్కల్ వద్ద మరోసారి కరోనా టెస్టులు నిర్వహిస్తామని కరోనా నిబంధనలను రూపొందించిన నిపుణుల కమిటీ పేర్కొంది. ఇక సాధారణంగా ప్రస్తుతం ధరిస్తున్నట్లుగానే మాస్కులు ధరించాలని.. వెంట శానిటైజర్లను కూడా ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ సారి పంబా నదిలో స్నానమాచరించేందుకు భక్తులకు అనుమతి లేదని.. భక్తులు స్నానాలు చేసేందుకు ట్రావెన్ కోర్ దేవస్వామ్ బోర్డు పంబలో స్పెషల్ షవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక పంబలో లేదా సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదు. కేవలం నీలక్కల్ దగ్గర మాత్రమే పరిమితంగా బస చేసేందుకు ఏర్పాట్లు ఉన్నట్లు సమాచారం. స్వామి అయ్యప్పన్ రోడ్డు కొండ ఎక్కే సమయంలో మాస్క్లు తప్పనిసరి అన్న నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొండ ఎక్కే సమయంలో మాస్క్లు ధరిస్తే శ్వాస సమస్యలు ఎదురవుతాయని గతంలోనే వైద్యులు హెచ్చిరంచారు. అయితే కొండపై ట్రెక్కింగ్ చేసే సమయంలో భక్తులు సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు.
కాగా, స్వామి వారి దర్శనానికి 10 ఏళ్లలోపు పిల్లలతో పాటుగా 60 ఏళ్లు పైబడిన వారిని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అందుకు ఇందుకు కారణం.. వీరంతా తర్వగా కరోనా బారినపడే అవకాశం ఉందని.. ఈ కారణంతోనే వీరికి అనుమతివ్వట్లేదని తెలుస్తోంది.