గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస సంఘటనలపై స్వామి పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నప్పటికీ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వామి పరిపూర్ణానంద ఏపీలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస ఘటనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ముఖ్యంగా తిరుమలపై జగన్ సర్కార్ కేబినెట్లో మంత్రిగా ఉన్న కోడాలి నాని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ అవసరం లేదన్న వ్యాఖ్యల పట్ల.. సీఎం జగన్ వివరణ ఇవ్వాలన్నారు. మంత్రి కోడాలి నానికి ఏం అవగాహన ఉందన్నారు. రాజ్యంగ నిబంధనలు కానీ.. ఒక ధర్మం పట్ల గౌరవం కానీ ఉందా..? అంటూ ప్రశ్నించారు. ధర్మం పట్ల గౌరవం లేని నాయకులు ఏది పడితే అది మాట్లాడరాదని హెచ్చరించారు.
తిరుమల శ్రీ వారి చరిత్ర ఏనాటిదో గ్రహించాలని, ఈ కలియుగం ప్రారంభం నుంచి మొదలు.. యుగాంతం వరకు తిరుమల శ్రీనివాసుడే ఈ ప్రపంచానికి పాలకుడని గుర్తించాలన్నారు. స్వామి వారి దర్శనానికి వెళ్తే.. సీఎం జగన్ కూడా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఒక వేళ సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే మంత్రి కోడాలి నాని చెప్పిన మాటలను ఆమోదించినట్లే అవుతుందన్నారు.
జగన్ చుట్టు కుట్ర జరుగుతుందేమో..?
గత కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలను రాజకీయ కోణంలో చూస్తే.. జగన్ చుట్టూ రాజకీయ కుట్ర ఏమైనా జరుగుతుందేమో అన్న అనుమానాలను లేవనెత్తుతూ..దీనిని సీఎం జగన్ గ్రహించాలంటూ హితవు పలికారు.
ప్రభుత్వాల ప్రమేయం లేకుండా చూడాలి
రాష్ట్రంలోని హిందూ క్షేత్రాల్లో ప్రభుత్వ ప్రమేయం లేకుండా చూడాలని స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.ఇతర మతాల్లాగే మా మందిరాల వ్యవహారాలను మేమే చూసుకుంటామని.. వీటిలో ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందన్నారు. త్వరలోనే ఈ అంశాలు ఓ కొలికకి వస్తాయన్నారు.