హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గెలుపు అనంతరం ఈటల రాజేందర్ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించిన మరుసటి రోజు సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా పలు వ్యాఖ్యలు చేయగా.. కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. పెట్రో ధరలపై సెస్ను పూర్తిగా ఎత్తివేయాలని.. రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఢిల్లీలో ఆందోళన చేపడుతానంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంపై బీజేపీ క్యాడర్ అంతా రగిలిపోతోంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు బండి సంజయ్ టీం రెడీ అవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.
I will be addressing the Press Conference at 1PM at BJP State Office. pic.twitter.com/yvzM0JOSdL
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 8, 2021
కాగా, హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమి పాలవ్వడంతో సీఎం కేసీఆర్ ప్రస్టేషన్లో ఉన్నారంటూ బీజేపీ నేతలు అంటున్నారు. ఓటమి అంశాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం కేసీఆర్ తన ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.