తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే తొలి ప్రక్రియలో పట్టభద్రుల ఓటర్ల నమోదు అక్టోబర్ 1 వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది. నవంబర్ 6వ తేదీ వరకు పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానాల పట్టభద్రులు వారి ఓటును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియకు కావాల్సిన విద్యార్హతలతో పాటు.. ఆన్లైన్లో నమోదు చేసుకునే స్టెప్స్ తెలుసుకుందాం. గతంలో పట్టభద్రుల ఓటు హక్కు కలిగిన వారు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
పట్టభద్రుల ఓటర్ నమోదుకు అర్హతలు
- దరఖాస్తుదారు సంబంధింత నియోజకవర్గంలో నివాసితుడై ఉండాలి.
- అంతేకాదు.. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్,ఖమ్మం,వరంగల్,నల్గొండ జిల్లాలల్లో ఓటు హక్కు కలిగి ఉండాలి
- నవంబర్ 1వ తేదీ,2017 నాటికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
కావాల్సిన పత్రాలు
- డిగ్రీ పాసైన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ (స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది)
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో (స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది)
- ఓటర్ గుర్తింపుకార్డు (ఎపిక్ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గ సమాచారం, ఇతర డిటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది)
- ఆధార్ కార్డు లేదా ఇతర నివాస గుర్తింపు కార్డు (ప్రస్తుత చిరునామా ఎంటర్ చేయాల్సి ఉంటుంది)
- గతంలో పట్టభద్రుల ఓటు హక్కు కలిగి ఉంటే.. దానికి సంబంధించిన వివరాలు కూడా అవసరం
- మొబైల్ నంబర్, ఈ- మెయిల్ ఐడీ కూడా ఉంటే.. వాటిని కూడా అప్లికేషన్లో నమోదు చేయవచ్చు
పై వాటిని జత చేసిన తర్వాత..రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ www.ceotelangana.nic.in కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత E-Registration కాలమ్పై క్లిక్ చేయాలి. అక్కడ రెండో ఆప్షన్గా ఉన్న Council Constituencyపై క్లిక్ చేస్తే Form18 (GRADUATES) వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. https://ceotserms1.telangana.gov.in/MLC/Form18.aspx.దీంట్లో పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత.. సబ్మిట్ SUbmit కొడితే సరిపోతుంది.
ఇక భౌతికంగా దరఖాస్తు పత్రాలను అందజేయాలనుకున్నవారు.. ఫాం-18 ప్రకారం కావాల్సిన సర్టిఫికేట్స్ను జతచేసి.. ఎమ్మార్వో/మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.