టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి అస్తమయం

Spread the love

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం నాడు కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో బాత్‌రూంలోనే కుప్పకూలిపోయారు. దంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలుగు సినీరంగంలో తనదైన ముద్రవేసుకున్న జయ ప్రకాష్ రెడ్డి ఎన్నో చిత్రాల్లో హాస్య నటుడుగా, విలన్‌గా పాత్రలను పోషించారు. రాయలసీమ భాషతో ఆయన ఎంతో మందితో ప్రశంసలు పొందడమే కాకుండా.. ఇదే ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం కరోనా కారణంతో షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఆయన తన సొంత జిల్లా గుంటూరులోనే ఉంటున్నారు. జయ ప్రకాష్ రెడ్డి 1946 అక్టోబర్‌ 10వ తేదీన జన్మించారు. బ్రహ్మపుత్రుడు చిత్రంతో 1988లో సినిమా రంగంలోకి ప్రవేశించారు. అయితే అంతకు ముందు నుంచి కూడా ఆయన నాటకరంగంలోనే ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా.. హాస్యనటుడుగా, విలన్‌గా తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేశారు. ప్రేమించుకుందాం రా సినిమాలో నటుడిగా ఆయనకు పెద్ద బ్రేక్‌ రావడంతో.. ఆ తర్వాత సమర సింహారెడ్డి చిత్రంలో నటించిన విలన్‌ పాత్రతో తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించారు. జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Spread the love
error: Content is protected !!