తూర్పు గోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రమాదం చోటుచేసుకుంది. సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణ సమీపంలోని కళ్యాణోత్సవ రథం అగ్నిప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1.00 గంట ప్రాంతంలో చోటుచేసుకుంది. మందిరానికి 200 మీటర్ల దూరంలోని ఓ షెడ్డులో ఈ రథాన్ని భద్రపరిచారు. అయితే అకస్మాత్తుగా అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో స్వామి వారి రథం పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఈ రథాన్ని అరవై ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేయించారు. ఇది 40 అడుగుల ఎత్తు ఉంది. ప్రతి ఏటా స్వామి వారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఘనంగా రథోత్సవం జరుగుతుంది.
అయితే ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా.? లేదా ఎవరైనా కుట్రపూరితంగా ఆకతాయిలతో ఈ పని చేయించారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.