హోలీ పండుగ వేళ.. యూపీలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బులంద్షహర్ పట్టణంలో మరోసారి సాధువు హత్యకు గురికావడం కలకలం రేపింది. గతేడాది కూడా ఇదే ప్రాంతలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఆ సంఘటన ఇంకా మరువక ముందే.. ఇదే ప్రాంతంలో మరో ఆలయ పూజారి హత్యకు గురికావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. బులంద్షహర్ సమీపంలోని షికార్పూర్ ఆంచ్రూ కాలా గ్రామంలో ఉన్న ప్రసిద్ధి ధక్వాలే ఆలయానికి గత వారం రోజుల క్రితం అశోక్ కుమార్ అనే పూజారి.. ఆలయ పూజారిగా విచ్చేశారు. ఆయన సాలెంపూర్ సమీపంలోని కైలావన్ గ్రామానికి చెందిన పూజారి. ఆయన వయస్సు 50 ఏళ్లు.
అయితే సోమవారం తెల్లవారుజామున ఆలయ సమీపంలోని పోలంలో శవమై తేలడంతో స్థానిక భక్తులు షాక్ తిన్నారు. జాతీయ మీడియా స్వరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు పదునైన ఆయుధంతో పూజారి గొంతు కోసి హతమార్చారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కూడా ధృవీకరించారు. గతేడాది కూడా ఇదే బులంద్షహర్ ప్రాంతంలో సాధువుల హత్య జరగడంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. బులంద్షహర్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.