అందరూ అనుకున్నట్లుగానే బీజేపీ తదుపరి ఏజెండా ఏంటో కేంద్రమంత్రి చెప్పేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శత్రుదేశం వైపు నుంచి ఒక్క బుల్లెటు వస్తే.. పది బుల్లెట్లు పంపించాలని ఆజ్ఞలు ఇచ్చే కేంద్ర రక్షణ మంత్రులను కూడా ఈ సర్కార్లో చూశాం. ఈ క్రమంలో ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి సైనికుల ప్రాణాలను బలిగొంటే.. అందుకు ప్రతీకారం కూడా తీర్చుకుంది మోదీ సర్కార్. శత్రుదేశంలో ఉన్న ఉగ్రవాదుల శిభిరాలపై సర్జికల్ స్ట్రైక్, ఏయిర్ స్ట్రైక్ చేశారు. అంతేకాదు.. జమ్ముకశ్మీర్కు ఉన్న స్వయంప్రతిపత్తి ఆర్టికల్ 370ని తొలగించడం అసాధ్యమనుకున్న వేళ.. దానిని తొలగించి మోదీ సర్కార్ సత్తా ఏంటే దేశ ప్రజలకు తెలియజేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తదుపరి ఏజెండా ఏంటో అన్నదానిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ క్లారిటీ ఇచ్చేశారు.
ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసిన మోదీ సర్కార్ తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడమేనన్నారు. తమ తదుపరి ఏజెండా కూడా అదేనని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన “మిర్పూర్ బలిదాన్ దివస్” కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు కాదని అనేకమంది అభిప్రాయపడ్డారని.. కానీ మోదీ సర్కార్ చేసి చూపిందని.. ఇదే తరహాలో PoKను కూడా స్వాధీనం చేసుకుని చూపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.