దేశంలో రోజురోజుకు హిందూ ఆలయాలు, పూజారులు, సాధువులు లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. లాక్డౌన్ కాలం నుంచే గమనిస్తే.. పాల్ఘర్లో ఇద్దరు సాధువులపై మూకదాడి చేసి అతికిరాతకంగా హతమార్చిన సంగతి గుర్తిన్నదే. ఆ తర్వాత యూపీలోని బులంద్షెహర్లో మరో పూజారిని హతమార్చారు దుండగులు. ఇక ఈ ఘటనల వార్తలు మరవకముందే.. పంజాబ్,హర్యానా ప్రాంతంలో ఓ ఆశ్రమంలోని సాధువుపై హత్య జరిగింది. ఈ ఘటనలన్నీ మరువకముందే.. బీహార్లో నక్సలైట్ల చేతిలో ఓ ఆలయ పూజారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన గత ఆగస్టు నెలలోనే చోటుచేసుకుంది.
ఇప్పుడు తాజాగా శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో జరిగిన మరో ఘోర సంఘటన యావత్ భారతదేశాన్ని వణికించేలా ఉంది. ఏకంగా ముగ్గురు అర్చకులను దారుణంగా హతమార్చారు దుండగులు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా నగరం సమీపంలోని గుట్టుల ప్రాంతంలో ఉన్న అర్కేశ్వర ఆలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా ఈ అర్కేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియన వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి.. అక్కడ ఉన్న ముగ్గురు అర్చకులను అతి కిరాతకంగా హతమార్చారు. అనంతరం ఆలయ హుండీలను పగులగొట్టి.. అందులో ఉన్న ధనాన్ని దోచుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో పడి ఉన్న హుండీలను చూస్తే ఇది దోపిడీ దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆలయ అర్చకులను హతమార్చడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. మృతి చెందిన ముగ్గురు అర్చకులను గణేష్, ప్రకాష్, ఆనంద్లుగా గుర్తించారు.

ఈ దారుణ సంఘటనపై సీఎం యడియూరప్ప స్పందించారు. ఈ దారుణ ఘటనపై వెంటనే ఎంక్వైరీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. జరిగిన సంఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.