కరోనా మహమ్మారి ఏపీ వైసీపీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా బారినపడి మరణించారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. ఇటీవల ఆయనకు కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతుండగా.. గుండెపోటు రావడంతో బుధవారం నాడు మరణించారు.
బల్లి దుర్గాప్రసాద్ 1985వ సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నెల్లూరు జిల్లాలోని గూడురు నుంచి ఏకంగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2019లో వైసీపీలో చేరిన ఆయన.. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఎంపీ దుర్గాప్రసాద్ మృతిపట్ల.. ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. ఇతర పార్టీల నేతలు కూడా ఎంపీ దుర్గా ప్రసాద్ మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.