దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతుండగా.. రికవరీ మాత్రం సగం కూడా ఉండటం లేదు. అయితే ఈ క్రమంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కీలకం అని తెలిసిందే. వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సినేషన్ జరిగితే.. ఈ మహమ్మారికి చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయం ఉంది. అయితే ఇప్పటికే రెండు దశల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇవ్వగా.. అనంతరం 60 ఏళ్లు పైబడ్డ వారితో పాటు.. 45 ఏళ్లు దాటి.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ చేశారు. అయితే ఈ దశలో కేవలం కొందరు మాత్రమే వ్యాక్సినేషన్ వేసుకున్నారు. అనంతరం 45 ఏళ్లు పైబడ్డ వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వ్యాక్సిన్ వేసుకునేందుకు అనేక ప్రాంతాల్లో ప్రజలు ముందుకు రావడం లేదు. కరోనా టీకా వేసుకునేందుకు కొందరు భయపడుతుంటే.. మరికొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ఛత్తీస్ఘడ్లోని పలువురు అధికారులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. బీజాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా వ్యాక్సిన్పై అవగాహన పెంచేందుకు అధికారులు ప్రచత్నిస్తున్ఆనరు. కరోనా టీకా వేసుకున్న వారికి టమాటాలను ఉచితంగా అందిస్తున్నారు. దీంతో కరోనా టీకా వేసుకునేందుకు స్థానిక మహిళలు ముందుకు వస్తున్నట్లు కరోనా టీకా సెంటర్ అధికారి పురుషోత్తం సల్లూర్ తెలిపారు. ఇలా చేయడం వల్ల రైతులకు కూడా లాభం కలుగుతుందని.. వారు పండించే టమాటా పంటను మున్సిపాలిటీకి అప్పగించాలని సదరు అధికారి రైతులను కోరారు. మొత్తానికి టమాటాలను ఉచితంగా ఇవ్వడంతో స్థానిక మహిళలు కరోనా టీకా వేసుకునేందుకు సుముఖత చూపుతుండటం అక్కడి అధికారులకు కూడా సంతోషాన్ని ఇస్తోంది.
Chhattisgarh: Tomatoes being offered to people in Bijapur Municipal limits, by Municipality, to encourage them to get vaccinated for #COVID19. An official, Purshottam Sallur says, "It's being done to encourage them. We appealed to vegetable vendors, they supplied to municipality" pic.twitter.com/3LHPKfm6Mr
— ANI (@ANI) April 20, 2021