టెర్రరిస్టులకు స్వర్గధామంగా చెప్పుకునే పాక్లో సామాన్యుల జీవితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉగ్ర శిక్షణలు ఇవ్వడం.. అమాయక ప్రజలను ఉగ్రవాదం వైపు ఆకర్షింపచేయడం అక్కడి ఉగ్ర సంస్థల పని. అయితే వారు చేసే ఈ దుర్మార్గపు పనులతో అక్కడి సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు కారణం.. అక్షరాభ్యాసం చేయాల్సిన పిల్లలు కూడా తుపాకులను పట్టుకోవడమే. తెలిసీ తెలియని వయస్సులో వారికి ఉగ్రవాదాన్ని నూరిపోస్తూ.. మానవాళిపై యుద్ధం చేసే రాక్షసులుగా తీర్చి దిద్దుతున్నారు. పెన్ను పట్టుకోవాల్సిన పిల్లలు.. గన్ పట్టుకోవడం తెలియక వాటిని ట్రిగ్గర్ నొక్కుతుండటంతో పలు ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా పెషావర్ సమీపంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బుధవారం నాడు.. వాయువ్య ప్రాంతంలోని పెషావర్ సమీపంలో బహిరంగ ప్రదేశాల్లో గ్రేనేడ్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని ఆటలాడుకునే వస్తువులుగా భావించిన పిల్లలు.. వాటిని వారి ఇంటికి పట్టుకుని వెళ్లారట. అక్కడే వాటితో ఆడుకుంటుండగా.. ఓ గ్రేనేడ్ పిన్ ఊడిపోయి పేలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.