కేరళలో కలకలం రేపుతోన్నపొలిటికల్‌ హత్యలు..! కాంగ్రెస్‌ పనేనంటున్న సీపీఎం..! కానీ..

Spread the love

మరికొద్ది రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్న వేళ.. కేరళలో పొలిటికల్‌ మర్డర్స్‌ కలకలం రేపుతున్నాయి. అధికార సీపీఎం పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు ఆదివారం నాడు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనంటూ ఆరోపిస్తోంది అధికార సీపీఎం పార్టీ. అంతేకాదు ఆ పార్టీ అనుభంద సంస్థ డీవైఎఫ్‌ఐ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యలే అంటూ ఆరోపణలు గుప్పిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలోని రూరల్‌ ప్రాంతానికి చెందిన వెంజర్‌మూడు గ్రామంలో ఇద్దరు సీపీఎం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. వీరిలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతులను సీపీఎం పార్టీకి చెందిన మితైలాజ్‌ (32), హక్‌ మహ్మద్‌(25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హక్ మహ్మద్‌ తన టూ వీలర్‌పై మితైలాజ్‌ను తన ఇంటి వద్ద దింపేందుకు వెళ్తుండగా.. వీరిని దుండగులు అటకాయించి.. దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలేనంటూ సీపీఎం లీడర్లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు వెనుకుండి ఈ హత్యలు చేయించారని ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సీపీఎం చేస్తున్న ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల సీపీఎం పార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తూ.. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గుర్ని అరెస్ట్ చేశారని.. వారిలో తమ వారు ఎవరూ కూడా లేరని తెలిపారు. అయితే అరెస్ట్‌ అయిన వారు ఎస్‌డీపీఐతో లింకులు ఉన్నవారిగా తెలుస్తోందని.. అసలు నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఈ పొలిటికల్ మర్డర్స్‌తో తిరువనంతపురం హీటెక్కింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


Spread the love
error: Content is protected !!