బీహార్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మధుబని జిల్లాలోని ఖిర్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నదరోహర్ మహాదేవ్ ఆలయంలో ఇద్దరు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఏప్రిల్ 20వ తేదీ (మంగళవారం) రాత్రి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగులు ఆలయ పూజారులను పదునైన ఆయుధాలతో హతమార్చారని తెలిపారు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదన్నారు. ఖిర్హార్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అంజేష్ కుమార్ సంఘటనా స్థలికిచేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను బసోపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరియాపూర్ నివాసి హీరానంద్ దాస్, భగవాన్పూర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ మిశ్రాగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నట్లు అంజేష్ కుమార్ తెలిపారు.
కాగా, దైనిక్ జాగరణ్ ప్రచురించిన తాజా కథనం ప్రకారం.. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దీపక్ చౌదరి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. డబ్బులు విరాళంగా ఇవ్వనందుకే నిందితుడు పూజారులను హతమార్చినట్లు తెలిపారు. అయితే స్థానికులు మాత్రం ఈ సంఘటనపై అనుమానాలు ఉన్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును లోతుగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు.
మరో ఘటనలో..
ఇక మధుబని జిల్లాకు చెందిన మరో సంఘటనలో విశ్వామిత్ర ఆశ్రమం మహంత్ పోలీసులను సెక్యూరిటీ కోరారు. ఆశ్రమం సమీపంలో సుమారు 8-10 మంది ముసుగు ధరించి ఆశ్రమంలోకి చొరబడేందుకు యత్నించారని తెలిపారు. ఆశ్రమంకు సరఫరా అయ్యే విద్యుత్ను కట్ చేయడం గమనించామని సదరు ఆశ్రమ మహంత్ పేర్కొన్నారు. ఆశ్రమంలోని సాధువులు, గ్రామస్థుల అప్రమత్తతో వారు అక్కడి నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆశ్రమం వద్ద పోలీసులు ఇద్దరు గార్డులతో రక్షణ కల్పిస్తున్నారు.