విదేశీ యాప్లకు మెల్లి మెల్లిగా చెక్ పెడుతున్నారు దేశ ప్రజలు. గత కొద్ది రోజులుగా ట్విట్టర్,ఫేస్బుక్,వాట్సాప్లపై చెలగరేగుతున్న అనుమానాలతో యూజర్లు స్వదేశీ యాప్లపై దృష్టి మరల్చుతున్నారు. తాజాగా ట్విట్టర్ను పోలీన దేశీ యాప్ “కూ” యూజర్ల మనసును దోచుకుంటుంది. అచ్చం ట్విట్టర్కు ధీటుగా ఉండటమే కాకుండా.. ప్రాంతీయ భాషల్లో కూడా ఉండటంతో ఎక్కువ మంది “కూ”లోకి క్యూ కడుతున్నారు. బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఈ కూ యాప్ అనతీకాలంలోనే యూజర్లను పెంచేసుకుంది. తాజాగా 5 మిలియన్లను దాటేసింది. ఈ క్రమంలో పలువురు రాజకీయ నేతలు కూడా విదేశీ ట్విట్టర్కు ధీటుగా ఉంటుందని.. “కూ” యాప్లోకి లాగిన్ అవుతున్నారు. ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన పేజీలే కాకుండా.. న్యూస్ ఛానెల్స్,సెలబ్రిటీలు కూ యాప్ను ఉపయోగిస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ కూ కమ్యూనిటీలోకి చేరారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ”లో తాను ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇకపై తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఈ “కూ”యాప్లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్,కర్ణాటక సీఎం యడియూరప్పు ఈ “కూ”యాప్ను వినియోగిస్తున్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలు ఇండియా పోస్ట్, మై గవర్నమెంట్ ఇండియా, డిజిటిల్ ఇండియాలు కూడా “కూ” యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఇదిలావుంటే.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ట్విటర్ సంస్థ మధ్య దూరం నెలకొన్న వేళ.. కేంద్ర మంత్రి “కూ” అకౌంట్ తెరవడం ప్రాధాన్యత సంతరించుకుంది.