యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సర్కార్ రాష్ట్రంలోని గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో క్రైం రేటును తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు గ్యాంగ్స్టర్కు చెందిన ఇల్లును కూల్చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు.. గ్యాంగ్స్టర్ బ్యాచ్కు చెందిన ఇతర క్రిమినల్స్ను కూడా అరెస్ట్ చేయడంతో పాటు.. పలువురిని ఎన్కౌంటర్ చేసింది. అయితే వికాస్ దూబే పోలీసు అధికారులపై దాడికిదిగి చంపడంతో.. దేశ వ్యాప్తంగా యూపీ వార్తల్లోకి ఎక్కింది. దీంతో రాష్ట్రంలోని గ్యాంగ్స్టర్లపై దృష్టిసారించింది.
తాజాగా.. లక్నోలోని దిల్బాగ్ కాలనీలో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి చెందిన ఓ అక్రమంగా నిర్మించిన ఓ ఇంటిని గురువారం నాడు లక్నో మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కూల్చేశారు.
అయితే ఈ ఇంటిని కూల్చేందుకు ఉపయోగించి జేసీబీ ఖర్చులను కూడా.. గ్యాంగ్స్టర్ అన్సారీ నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.