యూపీలో దారుణం చోటుచేసుకుంది. హర్దోయ్ ప్రాంతంలో ఓ సాధువును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమర్చారు. అంతేకాదు.. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా దారుణంగా చంపేశారు. ఈ సంఘటన రాష్ట్రంలోని హర్దోయ్ ప్రాంతంలోని తడివాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తడివాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన కున్మూ గ్రామంలో సాధువు హరిదాస్, ఆయన కుటుంబ సభ్యులిద్దరు మృతిచెందినట్లు తమకు మంగళవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో తెలిసిందన్నారు.
సాధువు హరిదాస్, ఆయన కుటుంబ సభ్యులు ఆలయ సమీపంలో నిద్రిస్తున్న సమయంలో దుండుగులు ఇటుకలతో వారి తలలపై బాది హతమార్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని హర్దోయ్ ఎస్పీ అమిత్ గుప్తా వెల్లడించారు. ఈ దారుణ ఘటనకు ఆస్తి వివాదాలే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు అమిత్ గుప్తా తెలిపారు.
కాగా, సాధువు హత్యతో అక్కడి వాతావరణం హీటెక్కింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భద్రతా బలగాలను మోహరించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.