యూపీలో మరో దారుణం.. రామ్‌ జానకీ ఆలయ పూజారిపై కాల్పులు

Spread the love

యూపీలో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నాయి. ఓ వైపు కుల దురహంకార హత్యలు.. మరోవైపు అత్యాచారాలు. ఇదిలావుంటే.. గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు, ల్యాండ్‌ మాఫియా కూడా రెచ్చిపోతోంది. పాల్‌ఘడ్‌, బులందషహర్‌, కర్ణాటకలో సాధువులు,పూజారుల హత్యలు మరువకముందే.. రాజస్థాన్‌లో ఓ పూజారిని స్థల వివాదంలో సజీవ దహనం చేశారు దుర్మార్గులు. ఈ విషయం జరిగి రెండు మూడు రోజులు కూడా గడువకముందే.. తాజాగా యూపీలో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

అక్టోబర్‌ 10వ తేదీన రాష్ట్రంలోని గోండా జిల్లాలోని ఎటియాతక్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఉన్న తిర్రే మనోరమ గ్రామంలో రామ్ జానకీ దేవాలయ పూజారిపై కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆయన్ను లక్నోలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత కొద్ది సంవత్సరాలుగా భూ వివాదం కొనసాగుతోందని.. ఈ క్రమంలో పూజారిని హతమార్చేందుకు స్కెచ్ వేశారని తెలిపారు.

గతేడాది కూడా పూజారిపై హత్యాయత్నం

రామ్ జానకీ ఆలయంలో సమ్రత్ దాస్‌ అనే పూజారి అర్చకుడిగా ఉన్నారని.. అయితే ఆలయానికి చెందిన భూమిపై మాఫియా కన్నుపడటంతో పూజారికి, ల్యాండ్‌ మాఫియాకు గొడవ జరుగుతుందని తెలుస్తోంది. గతేడాది కూడా ఆలయ పూజారిపై హత్యాయత్నం చేశారని.. తాజాగా శనివారం రాత్రి మరోసారి కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని.. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆలయ భూమి స్థలం మొత్తం 25 ఏకరాలు ఉందని.. ఈ విషయంలోనే ఆలయ పూజారికి, మాఫియాకు మధ్య గొడవ జరుగుతుందని తెలిపారు.

లక్నో ఆస్పత్రికి తరలింపు

తొలుత దుండుగులు పూజారిపై కాల్పులు జరపడంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో.. లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు.

ఇద్దరు అరెస్ట్..

పూజారిపై కాల్పులు జరిపిన వ్యక్తుల్లో ఇద్దర్ని అరెస్ట్ చేశామని సూపరింటెండెంట్‌ శైలేష్ కుమార్ పాండే తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం పూజారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.


Spread the love
error: Content is protected !!