యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వ పరిపాలనపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నేతృత్వంలోని పరిపాలనలో అప్పుడప్పుడు అలా వాహనాలు బోల్తా పడతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయవర్గీయ. ఆయన చేసిన వ్యాఖ్యలు యూపీలో మరోసారి ఎన్కౌంటర్ జరుగుతుందేమోనన్న అనుమానాలు కల్గుతున్నాయి.
రాష్ట్రంలోని హత్రస్లో 19 ఏళ్ల యువతిపై నలుగురు కామాంధులు గ్యాంగ్రేప్కు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. సదరు బాధితురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ మంగళవారం నాడు కన్నుమూసింది. ఈ క్రమంలో హత్రస్లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై విపక్షలు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ఈ క్రమంలో కైలాష్ విజయ వర్గీయ చేసిన వ్యాఖ్యలు గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ తీరును గుర్తు చేస్తున్నాయి.
హత్రస్ గ్యాంగ్రేప్ ఘటనపై మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారని.. దీనిపై ఫాస్ట్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను జైలుకు పంపుతారని చెప్తూ.. యూపీకి సీఎం యోగీ అని.. ఆయన రాష్ట్రంలో ఏ సమయంలోనైనా వాహనాలు బోల్తాపడుతాయంటూ వ్యాఖ్యానించారు.
కాగా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ మార్క్ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అధికారం చేపడుతున్నప్పటి నుంచి.. స్థానిక గ్యాంగ్స్టర్లతో పాటు.. కరుడు గట్టిన నేరస్థులంతా వణికిపోతున్నారు. ఇటీవల మోస్ట్వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను ఎన్కౌంటర్ చేసిన విషయం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. వికాస్ దూబేతో పాటు.. ఆయన అనుచరులను కూడా ఎన్కౌంటర్లో లేపేశారు. అంతేకాదు.. ఇటీవల ముంబై నుంచి మరో గ్యాంగ్స్టర్ను లక్నోకు తీసుకువస్తుండగా.. మధ్యప్రదేశ్లో యాక్సిడెంట్ జరగడంతో సదరు గ్యాంగ్స్టర్ మృతిచెందాడు. ఈ ఘటనలో పోలీసులకు కూడా స్వల్పగాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై కూడా పలువురు అనుమానాలు లేవనెత్తారు. మొత్తానికి ప్రస్తుతం హత్రస్ గ్యాంగ్రేప్ నిందితులకు కూడా ఇలాంటి ఘటన జరుగవచ్చన్నట్లు కైలాస్ విజయ వర్గీయ హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.