కేటీఆర్‌పై వీహెచ్‌పీ ప్రశ్నల వర్షం..!! ఇకపై అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే..!

Spread the love

అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి దేశ వ్యాప్తంగా నిధి సమర్పణ అభియాన్‌ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంటే.. తెలంగాణలో మాత్రం అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లోని కొందరు వ్యక్తుల నిర్వాకం వల్ల వివాదాస్పదంగా మారుతోంది. సాక్షాత్తు ఓ మంత్రి పేరుతో ఉన్న ట్రస్టు సభ్యులు విడిగా చందా పుస్తకాలను ప్రింట్ చేయించి.. ప్రజల వద్ద నుంచి రాముడి గుడి పేరుతో డబ్బులను వసూలు చేస్తున్నారు. అంతేకాదు.. మరో ఎమ్మెల్యే పేరుతో కూడా ఇలాంటి చర్యలకు దిగారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ తీరుపై విశ్వ హిందూ పరిషత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌పై వీహెచ్‌పీ అధికార ప్రతినిధి ప్రశ్నల వర్షం కురిపించారు.

పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే స్పందించిన మంత్రి కేటీఆర్.. కోటానుకోట్ల భక్తుల విశ్వాసాలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాటలతో దాడులు చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. రాముడి పేరు పెట్టుకున్న మంత్రి కేటీఆర్‌.. ఇకనైనా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పాలని కోరారు. ఆదివారం నాడు మంత్రి కేటీఆర్‌ రెచ్చగొట్టే ప్రకటన చూస్తుంటే రామ మందిర నిర్మాణంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న మాటల యుద్ధాన్ని పార్టీ విధానంగా భావించాల్సి వస్తుందని వీహెచ్‌పీ అభిప్రాయ పడింది.

హిందువుల విశ్వాసాలను గాయ పరచడంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంతో పోటీ పడుతోందని.. రామ కార్యానికి అడ్డుపడాలని చూస్తే ప్రజలు క్షమించరని రావినూతల శశిధర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రామ నామస్మరణతో మార్మోగిపోతుంటే కుహానా లౌకిక వాదులకు నిద్ర పట్టడం లేదన్నారు. ఇకపై శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు కార్యకలాపాలపై ఎవరైనా అనవసరంగా నోరు జారితే చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వీహెచ్‌పీ హెచ్చిరించింది.


Spread the love
error: Content is protected !!