తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వీహెచ్పీ భగ్గుమంటోంది. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడంపై నిషేధం విధిస్తూ.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. దీపావళి పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచాపై నిషేధం విధించాలంటూ న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ కాల్చడం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే పిటిషనర్ వాదనలను విన్న హైకోర్టు.. ఇప్పటి వరకు తెరిచి ఉన్న క్రాకర్స్ షాప్స్ను మూసేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా క్రాకర్స్ అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని.. ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఈ నెల(నవంబర్)19వ తేదీన తెలపాలంటూ హైకోర్టు తెలిపింది.
హైకోర్టు తీర్పుపై మండిపడ్డ వీహెచ్పీ.. హిందువుల పండుగల సమయంలోనే ఇలాంటివి పర్యావరణ ప్రియులకు గుర్తువస్తాయా..? అంటూ ప్రశ్నించారు. హిందువులు సంస్కృతి సంప్రదాయాలు, ఎన్నో ఏళ్లనుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం పండుగలు జరుపుకుంటే.. కేసులు నమోదు చేస్తారా..? అంటూ విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ప్రశ్నించారు. అలా అయితే ఎన్ని కేసులు నమోదు చేసుకుంటారో.. చేసుకోండని.. హిందువులు మాత్రం పండుగలను యథావిధిగా జరుపుకుంటారన్నారు. హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కోర్టు తీర్పుపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి.. పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచాపై ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సవాళ్లు విసిరారు.
బాణాసంచా కాలుస్తే వచ్చే కాలుష్యం కంటే ఏసీల వాడకం ద్వారా ఏక్కువ కాలుష్యం వెలువడుతోందని.. మరి ప్రభుత్వం ఒకవేళ కాలుష్యాన్ని అరికట్టేందుకు కంకణం కట్టుకుంటే.. తొలుత ప్రగతి భవన్, హై కోర్టు, అసెంబ్లీ వంటి ప్రాంతాల్లో ఉన్న ఏసీలను వెంటనే తొలగించి.. ఆ తర్వాతప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఏసీలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక ప్రతి ఏడాది రాష్ట్రంలో వెలువడుతున్న కాలుష్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. వేటి ద్వారా ఎక్కువ కాలుష్యం విడుదలవుతుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతిఏటా.. వినాయక చవితి, దీపావళి, హోళి వంటి పండుగల వేళ.. పర్యావరణ ప్రియులు స్పందిస్తూ.. ఆ తర్వాత మౌనంగా ఉండటం దేనికి సంకేతమన్నారు. కేవలం హిందువుల పండుగలను మాత్రమే టార్గెట్ చేస్తూ.. వారి విద్వేశాలను బయటపెడుతున్నారని.. ఈ క్రమంలో ప్రభుత్వ తీరు కూడా హిందువుల పండుగలను వ్యతిరేకించే విధంగా ఉంటుందని ఆరోపించారు. వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ సర్కార్ వైఖరిని వెల్లడించాలని.. కోర్టు తీర్పును అమలు చేస్తుందా.. లేదా.. ప్రత్యేక ఆర్డినెన్స్ను తీసుకువచ్చి బాణాసంచా కాల్చడంపై విధించిన బ్యాన్ను ఎత్తివేస్తుందా..? అన్నది యావత్ హిందూ సమాజం ఎదురుచూస్తోందనిస్తోందని విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు.
Also Read..
పటాకుల కాల్చడంపై హైకోర్టు కీలక తీర్పు.. మండిపడుతున్న వీహెచ్పీ