దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన పాల్ఘర్ సాధువుల హత్య కేసు గురించి తెలిసిందే. తమ గురువు పరమపదించడంతో.. అంతిమ సంస్కారాలకు వెళ్లేందుకు బయల్దేరిన ఇద్దరు సాధువులను.. మహారాష్ట్రలోని పాల్ఘర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వందలాది మంది.. వారిపై మూకదాడి చేసి వారిని హతమార్చారు. ఈ ఘటనలో.. ఇద్దరు సాధువులతో పాటుగా.. వాహన డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఏప్రిల్ 16వ తేదీన జరగ్గా.. రెండు రోజుల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం మహా సర్కార్పై సీరియస్ అయ్యింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్లు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి ఫోన్ చేయడంతో.. వెంటనే ఘటనకు కారకులుగా భావించిన 115 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే
ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో.. పలువురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఇదంతా జరిగిన కథనం.
అయితే తాజాగా.. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో.. సాధువుల హత్య కేసుకు సంబంధించి.. నిజ నిర్ధారణ కమిటీ వేయనున్నట్లు వీహెచ్పీ నేత మిలింద్ పరాండే తెలిపారు. ఈ విషయాన్ని ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. సాధువుల హత్యకేసులో.. తమకున్న సమాచారం ప్రకారం.. పక్కా ప్లాన్తోనే జరిగిందని.. గ్రౌండ్ రిపోర్ట్ అందిందని.. అయితే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో.. అధికారులతో కలిసి నిజ నిర్ధారణ కమిటీ వేయనున్నామని.. ఇందులో పలువురు మహిళలతో పాటు.. సీనియర్ అధికారులు, రిటైర్డ్ జడ్జిలు కూడా ఉండనున్నట్లు తెలిపారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో.. దీనిపై అధికారిక ప్రకటన చేయలేదని సమాచారం. అయితే ఇప్పటికే తమకు గ్రౌండ్ రిపోర్ట్ అందిందని.. దానిని తాము మరోసారి పరిశీలిస్తామని మిలింద్ పరాండే అన్నారు.