యూపీలో గ్యాంగ్స్టర్లపై యోగీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. గ్యాంగ్స్టర్లకు చెందిన అక్రమ భవనాలతో పాటు.. అక్రమ వ్యాపారాలపై కూడా జూలు విదుల్చుతోంది. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ అనంతరం.. ఇతర చోటామోటా గ్యాంగ్స్టర్లు భయంతో వణికిపోతున్నారు. అయితే మరికొందరు గ్యాంగ్స్టర్లు మాత్రం రాజకీయ నేతల అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే వారిపై కూడా యోగీ సర్కార్ కఠినంగా వ్యవహరించడంతో పాటు.. వారిపై కేసులు నమోదు చేస్తోంది.
రెండు రోజుల క్రితమే.. లక్నోలోని దాలిబాగ్ ప్రాంతంలో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీకి చెందిన ఓ అక్రమ నిర్మాణాన్ని స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చేశారు. అంతేకాదు.. దానికి అయిన జేసీబీ ఖర్చులను కూడా అన్సారీ వద్ద నుంచే వసూలు చేయాలిని అధికారులు నిర్ణయించారు.
తాజాగా.. శుక్రవారం నాడు.. గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ అనుచరుడు రయిస్ ఖురేషీకి చెందిన ఓ కబేలాను నేలమట్టం చేశారు. మౌ ప్రాంతం గ్రీన్జోన్ పరిధిలో భూముల్లో దీనిని అక్రమంగా నిర్మాణం చేపట్టారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోని జిల్లా అధికారులు మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం.. జేసీబీలతో నేలమట్టం చేశారు.