దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాస్క్ ధరించడం ద్వారా ఈ మహమ్మారికి కాస్త చెక్ పెట్టవచ్చని ప్రభుత్వాలు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకొమ్మని ఎంత మొత్తుకున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఏ మాత్రం అవగాహన రావడంలేదు. అంతేకాదు.. ఎవరికైనా మాస్క్ ధరించమని చెప్తే.. రివర్స్ అవుతూ దాడులకు పాల్పడుతూ ప్రాణాలే తీస్తున్నారు. ఇటీవల పూణెలో జరిగిన ఓ ఘటనలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త మృతిచెందినట్లు ఓ జాతీయ వెబ్సైట్ ప్రచురించింది. అంతకుముందు దీనికి సంబంధించిన కథనాన్ని హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించింది. అయితే మృతుడు స్వయం సేవక్ అన్న విషయం తెలిసిన తర్వాత ఆ జాతీయ వెబ్సైట్ స్పెషల్ స్టోరీ ప్రచురించింది.
హిందుస్తాన్ టైమ్స్ తెలిపన వివరాల ప్రకారం..
పూణెలోని చకన్ సమీపంలోని మెదంకర్వాడి నివాసీ అభిషేక్ సంతోష్ పులాంబ్రికర్ అనే యువకుడు ఏప్రిల్ 6వ తేదీన తనకు ఎదురుపడ్డ ఓ ముగ్గురు వ్యక్తులను మాస్క్ ధరించాలంటూ సూచించారు. నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం శ్రేయస్కరమని చెప్పడంతో.. ఆ ముగ్గురు యువకులు ఆగ్రహంతో దాడికి పాల్పడ్డారు. తమకే మాస్క్ ధరించమని చెప్తావా..? అంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ గ్రౌండ్లో అభిషేక్ను చూసి.. కర్రలతో, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన అభిషేక్ చకన్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైసీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ.. ఏప్రిల్ 7వ తేదీన మరణించాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అభిషేక్ తల్లి మాలిని సంతోష్ ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 302 మరియు 34 కింద కేసులు నమోదు చేశారు. మెదంకర్వాడిలోని బాలాజీనగర్కు చెందిన గణేష్ భేరు రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మరణించిన యువకుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అని తెలిసి.. దీనికి సంబంధించి హిందూ పోస్ట్ అనే వెబ్సైట్ ప్రత్యేక కథనం ప్రచురణ చేసింది. ఏదైనా కానీ.. సమాజ హితం కోరుతూ మాస్క్ ధరించమని చెప్పినందుకు ఓ బాధ్యత గల యువకుడిని అకారణంగా పొట్టనబెట్టుకున్నారు దుర్మార్గులు. మాస్క్ ధరిస్తే మనతో పాటు.. మన చుట్టూ ఉన్న వారంతా సేఫ్ అన్న విషయాన్ని గ్రహించి ఉంటే ఈ దారుణ సంఘటన జరిగేది కాదు.