గన్‌పార్క్‌ వద్ద ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు

Spread the love

హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల రాజేందర్‌.. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ చాంబర్‌లో ఈటల రాజేందర్‌తో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో పాటుగా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అయితే అక్కడి నుంచి అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని.. అమరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజురాబాద్‌ గెలుపు ఆరంభం మాత్రమేనన్నారు. హుజురుబాద్‌ తీర్పుతో సీఎం కేసీఆర్‌కు దిమ్మతిరిగిపోయిందని.. దీంతో ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడంలేదని ఎద్దేవాచేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. తనను ఓడించేందుకు హుజురాబాద్‌లో రూ.600 కోట్లు ఖర్చుపెట్టారంటూ ఆరోపించారు.

ఉద్యమ ద్రోహులకు పదవులిస్తూ.. ఉద్యమ నాయకులను అవమానపరుస్తున్నారంటూ ఆరోపించారు. 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీదే విజయమని.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేస్తామంటూ వ్యాఖ్యానించారు. అయితే 2023కు ముందే కూడా ఎన్నికలు రావోచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Spread the love
error: Content is protected !!