బీజేపీ ఎంపీ ఇంటిపై కాల్పులు.. “నిన్ను ఎవరూ కాపాడలేరు.. చంపేస్తాం”అంటూ బెదిరింపు లేఖ..

Spread the love

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ ఇంటిపైనే కాల్పులు జరిపారు దుండగులు. ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు కూడా రాశారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికైన రంజీతా కోలీ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతేకాదు ఓ బెదిరింపు లేఖను కూడా ఎంపీ ఇంటికి అతికించారు. కాల్పులు జరిగిన సమయంలో నివాసంలోనే ఉన్న ఎంపీ రంజీతా కోలీ స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వారు, పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఎంపీ రంజీతా కోలీకి ఫోన్‌ చేసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నిన్ను ఎవరూ కాపాడలేరు..

కాగా, ఇంటికి అతికించిన లేఖలో ఎంపీని హతమార్చుతామంటూ బెదిరింపులు ఉన్నాయి. “నీ స్థాయికి మించిన పనుల్లో తలదూర్చితే నేరుగా కాల్చి చంపేస్తామని.. నిన్ను ఎవరూ కాపాడలేరంటూ” లేఖలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎంపీ నివాసంలో దుండగులు జరిపిన కాల్పుల బుల్లెట్ షెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సిట్‌ను ఏర్పాటు చేశామని డీజీపీ ఎంఎల్‌ లాథర్‌ తెలిపారు. దుండగులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 384, 506, ఆయుధాల చట్టం 3/25 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) మనీష్ త్రిపాఠి ఆధ్వర్యంలో ఉన్న బృందం దర్యాప్తు చేస్తుంది.


Spread the love
error: Content is protected !!